తెలంగాణపై BJP 'త్రినేత్ర' వ్యుహాం.. ఇక రంగంలోకి నేరుగా ప్రధాని మోడీ..!

by Disha Web Desk 19 |
తెలంగాణపై BJP  త్రినేత్ర వ్యుహాం.. ఇక రంగంలోకి నేరుగా ప్రధాని మోడీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంపై పట్టు సాధించేందుకు కాషాయ పార్టీ కసరత్తులు ముమ్మరం చేసింది. జాతీయ నేతల పర్యటనలను స్పీడప్ చేయనుంది. ఇప్పటికే పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా తెలంగాణకు కేంద్ర మంత్రుల రాక నిత్యకృత్యంగా మారిన విషయం తెలిసిందే. వారితో పాటు జాతీయ నాయకులు సైతం వరుసగా పర్యటిస్తున్నారు. కాగా ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయడంపై కమలనాథులు స్కెచ్ వేశారు. ఏకంగా ప్రధాని మోడీనే ఇక రంగంలోకి దిగనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు సైతం ప్రతి నెలా తెలంగాణను విజిట్ చేయనున్నారు. ప్రతినెల ఒకరు చొప్పున తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధానితో పాటు ఇద్దరు అగ్రనేతల టూర్లు తెలంగాణలో నెలకొకరి చొప్పున సాగనున్నాయి.

ఎన్నికల నాటికి ప్రతి నెలా ఒకరోజు తెలంగాణకు వస్తానని ఇప్పటికే అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలనకు వెళ్లిన నేతలు సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. వాస్తవానికి ఈనెలలోనే ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనలు కొనసాగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. దీంతో ప్రధాని టూర్ వచ్చే నెల 13వ తేదీన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా ఈనెల 28న పర్యటించాల్సి ఉండగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు. ఆయన షెడ్యూల్ త్వరలో ఫిక్స్ చేసుకోనున్నారు. ఫిబ్రవరి రెండో వారం తర్వాతే ఆయన టూర్ కూడా సాగనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ టూర్లు ఇలాగే సాగుతాయని తెలుస్తోంది.

దక్షిణాదిలో పాగా కోసం ప్రయత్నిస్తున్న కాషాయపార్టీకి ఈ సరికొత్త వ్యూహం బూస్టర్‌గా పనికొస్తుందని విశ్వసిస్తున్నారు. దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణను ఎంచుకోవడంతో ఇక్కడ పాగా వేయకుంటే ఇతర రాష్ట్రాల్లో పట్టు సాధించడం కష్టతరమవుతుందని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో అగ్ర త్రయం టూర్లు సాగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతకు తోడు ఈ త్రిమూర్తుల టూర్లు కొనసాగితే కాషాయజెండా రెపరెపలాండించడం పెద్ద కష్టమేమీ కాదని నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ఇంతకుమించిన అవకాశం మరోసారి రాదని, ఇప్పుడు కొట్టలేకపోతే భవిష్యత్‌లో కష్టంగా మారే అవకాశముందన్న నేపథ్యంలో అగ్ర నేతల టూర్లు కొనసాగనున్నాయి. ఇప్పటికే బూత్ స్థాయిలో బలోపేతమయ్యేందుకు 9 వేల వీధి సభలకు కాషాయ పార్టీ ప్లాన్ చేసుకుంది. కాగా ఇకనుంచి ఏకంగా మోడీ, షా, నడ్డాల వరుస టూర్లతో అధికారం సాధించవచ్చని భావిస్తున్న కమలనాథుల వ్యూహాలు ఏమేరకు సక్సెస్ అవుతాయనేది వేచిచూడాల్సిందే.

Also Read....

అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలు అమలు కాలే.. పెండింగ్‌లో ఉన్న బడ్జెట్ ఎంతో తెలుసా?



Next Story

Most Viewed